తెలిసి తెలియగ నీదు
అన్నమయ్య 30 వ సంపుటపు( ప్రత్యేక సంపుటపు) కీర్తనల తాత్పర్యము- విశ్లేషణ -139
ఆచార్యతాడేపల్లి పతంజలి వ్యాఖ్యానం 14 -01 -2026
శ్రీ తాళ్లపాక అన్నమాచార్య
సంకీర్తన
తెలిసి
తెలియగ నీదు - (తెలిసినా) తెగనీదు
తలపులో
నీ రూపు - తడవనీదు నిచ్చలును ॥పల్లవి॥
చలపట్టి
నిను మరులు - విడదు నా యెడ నెనరు
చలగి
ముత్యపుచిప్ప - స్వాతి చినుకాసి
కలసి
నీ కరుణ నాపై - కురియగా నిరతమును
నలుగడల
నీ మహిమ - వరుషించినట్లవునొకో ॥తెలిసి॥
అకట
పదియార్వేల - స్త్రీలరతి గలిగినను
సకియ
తన రూపు మది - చాటెనుగా నెనరు
ప్రకటముగ
శ్రీకృష్ణు - డిన్నియును గైకొనియు
ఒకటి
సంపదగోరి - పెనగినట్లేనొకో ॥తెలిసి॥
అవతారిక
ఈ
సంకీర్తనలో అన్నమయ్య పరమాత్మకూ, జీవాత్మకూ మధ్య ఉండే విడదీయరాని అనురాగ
బంధాన్ని వర్ణించారు. అనంత కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణుడు, తన భక్తుల ప్రేమ కోసం ఒక సామాన్యుడిలా తహతహలాడటం ఇందులోని ప్రధానాంశం.
పల్లవి
తెలిసి
తెలియగ నీదు - (తెలిసినా) తెగనీదు
తలపులో
నీ రూపు - తడవనీదు నిచ్చలును
- తాత్పర్యము
ఓ
స్వామీ! నీ మాయావిలాసం తెలిసీ తెలియనిదిగా ఉంటుంది. నీ తత్త్వం బోధపడినా, నీపై ఉన్న
మోహం మాత్రం తెగిపోదు. నా ఆలోచనల్లో నిరంతరం నీ రూపమే నిలుచుట వల్ల, నా మనసు ఇతర లోక విషయాలను ఎప్పుడూ (నిచ్చలును) తలవనివ్వదు.
- విశేషాలు
ఇక్కడ
'నిచ్చలును' (ఎల్లప్పుడూ) అనే పదం భక్తిలోని నిరంతరాయ
స్థితిని తెలుపుతుంది. భగవంతుని రూపం హృదయంలో ముద్రపడితే, ఆ
బంధం విడదీయరానిదని అన్నమయ్య భావం.
- మధుర భక్తి అంతరార్థం
నాయకుడైన
పరమాత్మ సౌందర్యానికి ముగ్ధురాలైన నాయిక (భక్తుడు), తన చిత్తాన్ని పూర్తిగా ఆయనకే
అంకితం చేసింది. జ్ఞానం కలిగినా కూడా ఆ మధురమైన అనురాగ బంధం నుండి బయటపడలేకపోవడమే
పరమకాష్ఠ.
మొదటి
చరణం
చలపట్టి
నిను మరులు - విడదు నా యెడ నెనరు
చలగి
ముత్యపుచిప్ప - స్వాతి చినుకాసి
కలసి
నీ కరుణ నాపై - కురియగా నిరతమును
నలుగడల
నీ మహిమ - వరుషించినట్లవునొకో
- తాత్పర్యము
పట్టుదల
వహించి నీపై పెంచుకున్న ఈ మోహం నన్ను వదలడం లేదు. ముత్యపు చిప్ప ఆశగా స్వాతి
చినుకు కోసం ఎదురుచూసినట్లు, నీ కరుణా రసం నాపై ఎల్లప్పుడూ కురవాలని
కోరుకుంటున్నాను. నీ మహిమ అనే వర్షం నాపై కురిసినప్పుడు కలిగే అనుభూతి వర్ణనాతీతం.
- విశేషాలు
'చలపట్టి', 'చలగి', 'కలసి',
'నలుగడల' పదాలలో రెండవ అక్షరం 'ల' ప్రాసగా వాడబడింది. స్వాతి చినుకు ముత్యపు
చిప్పలో పడితేనే ముత్యం అవుతుంది. అలాగే దైవకృప కలిగినప్పుడే భక్తుడు పరిపూర్ణత
చెందుతాడు.
- మధుర భక్తి అంతరార్థం
నాయిక
తన నాయకుని అనుగ్రహం కోసం వేచి చూసే ఆతురతను ఇది తెలుపుతుంది. భక్తుడి హృదయం ఒక
ముత్యపు చిప్ప అయితే, దైవ కరుణ ఒక అమూల్యమైన స్వాతి చినుకు వంటిది.
రెండవ
చరణం
అకట
పదియార్వేల - స్త్రీలరతి గలిగినను
సకియ
తన రూపు మది - చాటెనుగా నెనరు
ప్రకటముగ
శ్రీకృష్ణు - డిన్నియును గైకొనియు
ఒకటి
సంపదగోరి - పెనగినట్లేనొకో
- తాత్పర్యము
అయ్యో!
శ్రీకృష్ణుడికి పదిహేను వేల మంది గోపికలతో సుఖం ఉన్నప్పటికీ, తన మనసులో
మాత్రం ప్రియమైన భక్తురాలి (సకియ) రూపాన్నే చాటుకుంటాడు (నిలుపుకుంటాడు).
జగన్నాథుడైన శ్రీకృష్ణుడు అన్నింటినీ కలిగి ఉండి కూడా, తన
భక్తుల ప్రేమ అనే ఒక్కటే (ఒకటి) సంపదను కోరి వారితో అల్లుకుపోయినట్లు ఉండటం
విచిత్రం.
- మధుర భక్తి అంతరార్థం
లోకంలో
ఎన్ని జీవరాశులు ఉన్నా, పరమాత్మకు ప్రతి భక్తుడూ ప్రత్యేకమే. ఒక్క భక్తుడి ప్రేమ కోసం
కూడా ఆయన ఒక పేదవాడిలా వేచి చూస్తాడని, భక్తుల ప్రేమే ఆయనకు
అసలైన సంపద అని ఇక్కడి భావం.
ఈ పాట శిథిలమయింది. అన్నమయ్య వేంకటేశుని అనుగ్రహంతో
, అన్నమయ్య పద్ధతిలో పదాలను సరి చేసాను.
లభించిన పాట ఇది
తెలిసి
తెలియగ నీదు - (తెలిసినా) తెగనీదు
(..............................................)॥పల్లవి॥(..............................................మయో)
(చలపట్టి......మరులు....
విడదు నెనరు)
చలగి
ముత్యపుచిప్ప - స్వాతి చినుకాసిం
(.....................వరుషించినట్లవునొకో)॥తెలిసి॥
అకట
పదియార్వేల స్త్రీలరతి గలిగినను
(సఖియ) తన రూపు మది
(.....................) శ్రీకృష్ణుడిన్నియును
పేద
సంపదగోరి (పెనగి)నట్లేనొకో॥తెలిసి॥
No comments:
Post a Comment