అన్నమయ్య 30 వ సంపుటపు( ప్రత్యేక సంపుటపు) కీర్తనల తాత్పర్యము- విశ్లేషణ -172
ఆచార్యతాడేపల్లి పతంజలి వ్యాఖ్యానం 21-02 -2026
తాళ్లపాక పెదతిరుమలాచార్యుల వారు రచించిన ఈ కీర్తనలో, శ్రీవేంకటేశ్వర స్వామి మరియు అలమేలుమంగమ్మల దివ్య వివాహ
మహోత్సవ వేడుకను కళ్లకు కట్టినట్లుగా వర్ణించారు. పెళ్లి వేళలో చెలులందరూ కలిసి
సంబరంగా పాడుకునే ఈ పాటలో, ఆ దివ్య దంపతుల రూప
సౌందర్యాన్ని, వారి మధ్య ఉన్న చక్కని పొంతనను కవి
అత్యంత మనోహరంగా చిత్రించారు.
పల్లవి
నేఁడే పెండ్లివేళ నేఁడే నాగవల్లి
ఆడుచు సోబానఁ బాడు మనరే చెలులూ
తాత్పర్యము
"ఓ చెలులారా! ఈరోజే శుభప్రదమైన పెళ్లి సమయం, ఈరోజే నాగవల్లి ఉత్సవం(పెండ్లిలో నాలవనాడు జరుగు శుభకార్యము). మనమందరం సంతోషంతో ఆడుతూ, పాడుతూ ఆ దివ్య దంపతులకు పెండ్లిపాటలు (సోబానలు) పాడండి" అని చెలికత్తెలు ఒకరినొకరు
పురమాయించుకుంటున్నారు.
విశేషాలు
వివాహ క్రతువులో 'నాగవల్లి' అనేది ఒక ముఖ్యమైన ఘట్టం.
పెళ్లి సంబరాల్లో ఉండే కోలాహలాన్ని, మంగళ గీతాల ప్రాధాన్యతను
పల్లవిలో పెదతిరుమలాచార్యులు ప్రతిబింబించారు.
మధుర భక్తి అంతరార్థం
భగవంతుడికి, ప్రకృతికి (లేదా
జీవాత్మకు) జరిగే కల్యాణమే మోక్షానికి మార్గం. భక్తులందరూ ఈ దివ్య కల్యాణాన్ని
చూసి ఆనందించడం అంటే దైవ లీలలో పాలుపంచుకోవడమే.
చరణం 1
కనకాంబరుఁ డతఁడు కనకకుచగిరి యీకె
కొనబుగల యిద్దరికిఁ గూడెఁ బొంతనము
వనజనాభుఁ డతఁడు వనజలోచన యీకె
ఘనమైన కంకణము గట్టరే చెలులు
తాత్పర్యము
స్వామివారు బంగారు వస్త్రాలు ధరించిన కనకాంబరుడు, అమ్మవారు మేలిమి బంగారుకొండల వంటి స్తనములు
కలిగినది. వీరిద్దరి రూపాలు
ఒకరికొకరు ఎంతో చక్కగా సరిపోయాయి. ఆయన పద్మము నాభియందు కలవాడు (వనజనాభుడు), ఆమె పద్మము వంటి కన్నులు కలది (వనజలోచన). ఓ చెలులారా!
ఇటువంటి గొప్ప విలాసము కలిగిన ( కొనబు) జంటకు మంగళకరమైన కంకణాలు కట్టండి.
విశేషాలు
నాయికానాయకుల శారీరక సౌందర్యాన్ని 'కనక' (బంగారం), 'వనజ' (పద్మం) వంటి పదాలతో
పోలుస్తూ వారి దివ్యత్వాన్ని వర్ణించారు.
మధుర భక్తి అంతరార్థం
లక్ష్మీనారాయణుల కలయిక ఐశ్వర్యానికి, సృష్టికి సంకేతం. భగవంతుని సంకల్పానికి, ప్రకృతి సహకారం తోడైనప్పుడే సృష్టి పరిపూర్ణమవుతుంది.
చరణం 2
నీలవర్ణుఁ డతఁడు నీలకుంతలి యీకె
చాలుకొని యిద్దరికి జంట దగును
ఆలరైన శంఖధరుఁ డితఁ డీకె కంబుకంఠి
యీ లీల నారతులు యెత్తరే చెలులు
తాత్పర్యము
స్వామి నీలమేఘ శ్యాముడు, అమ్మవారు నల్లని కురులు కలది. వీరిద్దరి జంట వరుస కట్టినట్ళు ( చాలుకొని) చూడముచ్చటగా ఉంది. ఆయన శంఖాన్ని ధరించినవాడు, ఆమె శంఖము వంటి అందమైన మెడ కలది. ఓ చెలులారా! ఈ దివ్య
రూపాలకు మంగళ హారతులు పట్టండి.
విశేషాలు
శరీర ఛాయను, అవయవ సౌష్ఠవాన్ని
వర్ణిస్తూ వారి మధ్య ఉన్న అద్భుతమైన సాదృశ్యాన్ని కవి ఇక్కడ వివరించారు. శంఖం
మంగళకరమైన చిహ్నం, అది స్వామి చేతిలోనూ, అమ్మవారి కంఠంలోనూ వెలుగుతోంది.
మధుర భక్తి అంతరార్థం
భగవంతుడు నీలవర్ణమై ఆకాశమంత అనంతమైన వాడైతే, అమ్మవారు భక్తుల కోరికలను నెరవేర్చే కరుణామయి. వారిద్దరి
అన్యోన్యత భక్తజనులకు రక్షణ కవచం.
చరణం 3
జలధిశాయిని యతఁడు జలధికన్నెక యీకె
కలిగె నిద్దరికి వొక్క కైవాడము
అలరు శ్రీవేంకటేశుఁ డతఁ డీకె మహాలక్ష్మి
వెలయఁగల సిరి దీవించరే చెలులు
తాత్పర్యము
ఆయన క్షీర సముద్రముపై శయనించేవాడు, ఆమె సముద్ర రాజపుత్రిక. వీరిద్దరి మధ్య పుట్టుకతోనే
విడదీయరాని ఒకే సంబంధం ఉంది. ఆయనే సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరుడు, ఈమె మహాలక్ష్మి. లోకకల్యాణకారకులైన ఈ దంపతులను సకల సంపదలు
కలగాలని (సిరి వెలయాలని) దీవించండి.
విశేషాలు
సముద్రం వీరిద్దరికీ నివాసస్థానం. వేంకటేశ్వరుడు, మహాలక్ష్మిల దివ్యత్వాన్ని పెదతిరుమలాచార్యులు ఇక్కడ
ముక్తాయింపుగా చెప్పారు.
మధుర భక్తి అంతరార్థం
జగన్నాటక సూత్రధారి అయిన స్వామి, తన శక్తి స్వరూపిణి అయిన లక్ష్మీదేవితో కలిసి భక్తులను
అనుగ్రహిస్తారు. ఈ దివ్య దంపతుల ఆశీస్సులు పొందడమే మానవ జీవిత పరమార్థం.

No comments:
Post a Comment